
మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు – 2025 ప్రధానం
ఉదయక్రాంతి:- మీడియా రంగంలో సామాన్య పాత్రికేయుడిగా, నవసమాజ నిర్మాణం కోసం, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ, తనదైన శైలిలో వార్తా కథనాలతో ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, జర్నలిస్టుల, ప్రజా సంక్షేమం, రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ, ముఖ్యంగా కరోనా కాలంలో స్వచ్ఛందంగా ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజల పక్షాన పలు పోరాటాలు నిర్వహించిన సామాన్య జర్నలిస్టు, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన, ఉదయక్రాంతి తెలుగు దినపత్రిక రిపోర్టర్ మహమ్మద్ ఖాసీం చేస్తున్న కృషిని గుర్తించి, అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు – 2025తో ఘనంగా సత్కరించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి లోని ఆనం రోటరీ హల్లో ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఎస్ సరోజనమ్మ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని అదేవిధంగా సామాజిక సేవకురాలు షేక్ సమీరా ప్రధమ వర్ధంతిని పురస్కరించుకొని, నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రఖ్యాత కళాకారులు, సాహితీవేత్తల సమక్షంలో జర్నలిస్టుగా ఖాసీం చేసిన సేవలను గుర్తించి, ఆయనకు మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు-2025 అందించి, గౌరవించారు.

అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ మీడియా రంగంలో సామాజిక సేవ చేస్తున్న పాత్రికేయులకు జాతీయ ఉత్తమ జర్నలిస్టుల అవార్డు పురస్కారాలను ప్రదానోత్సవం చేస్తూ, వారికి అరుదైన గౌరవం అందిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన టైమ్స్ ఆఫ్ వార్త తెలుగు దినపత్రిక రిపోర్టర్ జాడ క్రాంతి కుమార్, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన తెలంగాణ వాణి తెలుగు దినపత్రిక రిపోర్టర్ పిల్లి రవి కిరణ్ లకు సైతం మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు – 2025ను అందజేశారు. వీరితోపాటు సామాజిక సేవ రంగంలో తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన కొండ సతీష్ కు సైతం జాతీయ అవార్డును అందజేసి, అభినందించారు. ఇదే వేదికపై పలువురు కళాకారులు, పర్యావరణవేత్తలు, సామాజిక సేవకులు, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని జాతీయ పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.

జాతీయ అవార్డు అందుకున్న ఉదయక్రాంతి రిపోర్టర్ మహమ్మద్ ఖాసీం మాట్లాడుతూ, తనకు మహాత్మ జ్యోతిరావు పూలే మహాత్ముని పేరు మీద మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని, జాతీయ అవార్డు ప్రధానం చేసిన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్
నకు, మంచిర్యాల జిల్లా జర్నలిస్టుగా తనను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, అండగా ఉన్న ఉదయక్రాంతి పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి,సహచర పాత్రికేయ మిత్రులకి, మిత్రులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు,ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంధ, ప్రజా, కుల, కార్మిక, విద్యార్ధి సంఘాలకు, వివిధ రాజకీయ పార్టీలకు, ఎల్లప్పుడూ తన అండగా ఉంటూ, ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న మహమ్మద్ ఖాసీం కు పలువురు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ , అభినందనలు తెలిపారు.
