జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
వేసవి కాలం సమీపిస్తున్నందున జిల్లాలో త్రాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో నిరంతరంగా నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి, మిషన్ భగీరథ అధికారి లతో కలిసి ఏఈ లు, మున్సిపల్ కమీషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో వేసవిలో త్రాగునీటి సరఫరా నిర్వహణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, వేసవికాలంలో జిల్లాలోని ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా నిరంతరాయంగా సరఫరా చేసే విధంగా కార్యచరణ రూపొందించి అమలు చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలోని మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలలోని వార్డులకు అవసరమైన మేరకు త్రాగునీటిని అందించాలని, పైడ్లైన్ల మరమ్మత్తులను గుర్తించి, త్వరితగతిన పూర్తి చేసి, అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో పైడ్లైన్ల లీకేజీ కారణంగా కలుషిత నీరు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అనుమానిత నీటిని పరీక్షించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమృత్ 2.0 పథకం క్రింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, వేసవి కాలంలో నీటిని అందించేందుకు సిద్ధం చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, త్రాగునీటిని అందించే ఓవర్హెడ్ ట్యాంక్లను సమయానుసారంగా శుభ్రపరచాలని, మున్సిపల్ పరిధిలోని వార్డులలో ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు తడి చెత్త, పొడి చెత్తలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. గత 3-4 సంవత్సరాలుగా జిల్లాలో త్రాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, పూర్తి వివరాలతో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
