
ఉదయక్రాంతి :- ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ మౌఖిక పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పర్యవేక్షణలో మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో మాక్ ఇంటర్వ్యూలను నిర్వహించారు. సింగరేణి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ ప్రిలిమినరీ పాసైన వారికి లక్ష రూపాయల ప్రోత్సాహం, మెయిన్స్ లోనూ విజయం సాధించిన వారికి మరో లక్ష రూపాయల ప్రోత్సాహాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగానే ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి మాక్ ఇంటర్వ్యూలను నిర్వహించి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్గనిర్దేశంలో సీనియర్ అధికారుల నేతృత్వంలో నమూనా మౌఖిక పరీక్షలను నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గత 15 రోజుల నుంచి ఆన్లైన్ పద్ధతిలో మాక్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. వీటిల్లో సింగరేణి సిఎండీ ఎన్ బలరామ్, ట్రాన్స్ కో సిఎండి కృష్ణ భాస్కర్, కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ ప్యానెల్ సభ్యులుగా వ్యవహరించారు.
మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సిఎండీ ఎన్ బలరామ్, ట్రాన్స్ కో సిఎండి కృష్ణ భాస్కర్, తెలంగాణ ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ ఫారూఖీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్యానెల్ లో మాక్ ఇంటర్వ్యూలు జరిగాయి. ప్యానెల్ సభ్యులు ఒక్కొక్క అభ్యర్థిని వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగారు. అనంతరం తుది ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై పలు కీలకమైన సూచనలు అభ్యర్థులకు చేశారు. ఆత్మ విశ్వాసంతో సిద్ధం కావాలని, సందేహాలను నివృత్తి చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు రానున్న రోజుల్లో మరిన్ని మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా మాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న అభ్యర్థులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తమను ప్రోత్సహించడం కోసం రెండు విడతలుగా ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూలను నిర్వహించడం, అలాగే తెలంగాణ భవన్ లో ఉండటానికి ఏర్పాట్లు చేయడానికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.