
ఉదయక్రాంతి :- తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉత్తర్వులను సవరించాలని రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు, అదేవిధంగా సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులకు వినతిపత్రాన్ని ఈమెయిల్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, గత కేసిఆర్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకానికి 5 లక్షల రూపాయలు కేటాయించగా, రాష్ట్రంలో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకానికి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల ప్యాకేజీకి పెంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని తలసేమియా, సికిల్ సెల్ ఆరోగ్య శ్రీ పథకానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నెల 15 వేల రూపాయల ప్యాకేజీ అందించగా, ఈ ప్యాకేజ్ లోనే ఐరన్ చిలేషన్ మాత్రలు, రక్తపరీక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. కానీ తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ఐరన్ ఓవర్ లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఐరన్ చలేషన్ మాత్రలతో పాటు డేస్వరాల్ ఇంజెక్షన్లు ఇన్ఫ్యూజ్ పంపుతో వాడాలని, అదేవిధంగా రక్త ఎక్కించడానికి లూకోసైట్ ఫిల్టర్లతో రియాక్షన్లు కాకుండా రక్తమెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షల పెంచినప్పుడు డేస్వరాల్ ఇంజక్షన్లు, ఇన్ఫ్యూజ్ పంపులు, లూకోసైట్ ఫిల్టర్లు, అర్హులైన వ్యాధిగ్రస్తులకు బోనో మార్పిడి ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ వ్యాధిగ్రస్తులకు ఏది అవసరం ఉన్నదో దానిని ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చకుండా, కేవలం నెలకు 15వేల రూపాయల పాత ప్యాకేజీనే కొనసాగించడం సరైనది కాదని, దీంతో వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం ప్యాకేజీని 15 వేల రూపాయల నుండి 30 వేల రూపాయలకు పెంచి, ఆరోగ్యశ్రీ పథకంలో డేస్వరాల్ ఇంజక్షన్లు, ఇన్ఫ్యూజ్ పంపులు, లూకోసైట్ ఫిల్టర్లు, అర్హులైన వ్యాధిగ్రస్తులకు బోనో మార్పిడిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని కోరారు.