
ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా నిలువ చేసిన ప్రభుత్వ అనుమతి లేని నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగిందని మంచిర్యాల జిల్లా మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి తెలిపారు. సోమవారం మందమర్రి పట్టణంలోని సిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు ప్రభుత్వ అనుమతి లేని నకిలీ విడి పత్తి విత్తనాలు నిలువ చేశారనే సమాచారం మేరకు కాసీపేట మండల వ్యవసాయ శాఖ అధికారి చల్లా ప్రభాకర్, పోలీస్ సిబ్బంది మందమర్రి సర్కిల్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామంలోని గుడిమల్ల చంద్రయ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించగా, 50 కిలోల ప్రభుత్వం నిషేధించిన నకిలీ విడి పత్తి విత్తనాలు కలవని తెలిపారు. గుడిమల్ల చంద్రయ్య ను విచారించగా తాండూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కూనారపు బాలకృష్ణ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో మార్చి 11, 2025న మందమర్రి పట్టణంలోని శ్రీపతి నగర్ కు చెందిన మహమ్మద్ సాహెబ్ జానీ, ముల్కల సుధీర్, మొదటి జోన్ కి చెందిన గోవిందుల శంకర్ లతో కలిసి నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తి వద్ద 50 కిలోల పత్తి విత్తనాలను 2000 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేశామని తెలిపారన్నారు. ఆ విత్తనాలను గుడిమల్ల చంద్రయ్య, బాలకృష్ణ, గోవిందుల శంకర్ లు ఆటో నెంబర్ 19 టీ 1712 లో చంద్రయ్య ఇంటికి తీసుకువచ్చి, వాటిని 2500 రూపాయలకు కిలో చొప్పున తెలిసిన రైతులకు అమ్ముదామని నిర్ణయించుకున్నారని తెలిపారు. లభించిన నకిలీ పత్తి విత్తనాల ధర కిలోకి సుమారు 2500 చొప్పున వాటి విలువ సుమారు 1,25, 000 రూపాయిలు ఉంటాయన్నారు. ఈ మేరకు వ్యవసాయ అధికారి చల్ల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పైన తెలిపిన 6గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు వాడటం వల్ల భూమి సారవంతం కోల్పోయి, రానున్న రోజుల్లో పంట దిగుబడి తగ్గుతుందని, పర్యావరణం పై సైతం ప్రభావం అవకాశం ఉంటుందన్నారు. గ్లైపోసిట్ పత్తి విత్తనాలు వాడటం వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధుల సైతం వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, ఐపీఎస్, బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ ల ఆదేశాల మేరకు ప్రజలు ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన, కొన్న, సరఫరా చేసిన, నిల్వ ఉంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నకిలీ పత్తి విత్తనాల సమాచార ఎవరికైనా తెలిసిన వెంటనే దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు. ఈ మేరకు ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవపూర్ ఎస్ఐ ఆంజనేయులు,కాసీపేట మండల వ్యవసాయ శాఖ అధికారి చల్లా ప్రభాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


